సూర్యోదయం
తెల్లతెల్లవారుతుండగా ఆనందం వెల్లివిరుస్తూ ఉంది.
పక్షుల కిలకిలారావాలతో ఉదయభానుడికి ఆహ్వానం పలుకుతున్నాయి.
ఝుమ్మన్న నాదంతో తేనెటీగలు ఝంకారం చేస్తున్నాయి.
పుష్పించిన పూలు
పరిమళాల పన్నీరును వెదజల్లుతున్నాయి.
“మన చీకటి బాధలు తీర్చడానికి వెలుగు దేవుడు వస్తున్నాడు”
అనే సంతోషవార్తను అందరికీ తెలియజేస్తున్నాయి రామచిలుకలు.
ఈ ప్రకృతిని పాలించే చక్రవర్తి వస్తున్నాడు అని సప్త సముద్రాలు..
జయజయధ్వానాలు చేస్తున్నాయా అన్నట్టు హోరెత్తి ఘోషిస్తున్నాయి.
కుహూ కుహూ అని కోయిలలు సూర్యునికి సుప్రభాతం పలుకుతున్నాయి.
తమ తాపాన్ని తీర్చడానికి వస్తున్న నాథున్ని
తనివితీరా చూడాలని తామరపూలు తహతహలాడుతున్నాయి..
ఆ సూర్యుని అందాన్ని చూసి అసూయ పడుతున్నాడా అన్నట్టుగా
చంద్రుడు మెల్లమెల్లగా అదృశ్యమవుతున్నాడు.
“మన చీకటి బాధలు తీర్చడానికి ప్రకృతి దేవుడు వస్తున్నాడు”
అనే సంతోషవార్తను అందరికీ తెలియజేస్తున్నాయి రామచిలుకలు.
ఇలాంటి స్వాగతాలను స్వీకరిస్తూ,
చీకటి తెరలను చీల్చుకుంటూ,
మబ్బులను పక్కకి తోసుకుంటూ,
తన వేడితో, వెలుతురితో మనందరినీ చైతన్యవంతులను చేయడానికి..
బాల భానుడు బయటకి వస్తున్నాడు….